ముంబై: కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఆస్పత్రిలో చేరేందుకు నిరాకరించిన ఘటన ముంబై నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. వాడాలా ప్రాంతంలో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుల్కు కరోనా సోకిందనే అనుమానంతో ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అయితే, గత బుధవారం నుంచి తనకు సాధారణ దగ్గు, జ్వరం మాత్రమే ఉన్నాయని కానిస్టేబుల్ ఓ వీడియోలో వెల్లడించాడు. ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ కూడా సమకూర్చలేదని వాపోయాడు. అందుకే సిబ్బందికి సహకరించలేదని పేర్కొన్నాడు. చివరకు పైఅధికారులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో.. సదరు కానిస్టేబుల్ కస్తూర్బా ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. ఇక కరోనా కేసుల్లో మహారాష్ట్ర దేశంలో ప్రథమ స్థానంలో ఉండగా.. అక్కడి కేసుల్లో సగానికంటే ఎక్కువ ముంబైలోనే ఉండటం గమనార్హం.
కరోనా: ఆస్పత్రికి వెళ్లేందుకు కానిస్టేబుల్ నిరాకరణ!